లాక్‌డౌన్‌లో ట్యాక్సీ డ్రైవర్లకు రూ.5 వేలు.. సీఎం సంచలన నిర్ణయం

లాక్ డౌన్ కాలంలో డ్రైవర్లకు ఊరట కలిగించే చర్యను దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. ప్రజా రవాణా చేసే కమర్షియల్ వాహనాలున్న డ్రైవర్లందరికీ నెలకు రూ.5 వేలు ఇవ్వనున్నట్లుగా వెల్లడించారు. ఆటో, ట్యాక్సీ, క్యాబ్, ఈ-రిక్షా వంటివి నడిపి జీవనోపాధి పొందేవారు ఇందుకు అర్హులని ప్రకటించారు. ప్రభుత్వం ప్రకటించిన రూ.5 వేలను నేరుగా వారి ఖాతాల్లోనే జమ చేయనున్నట్లు వివరించారు. అయితే, ఇది అమలు చేసేందుకు దాదాపు వారం నుంచి పది రోజుల లోపు సమయం పడుతుందని కేజ్రీవాల్ వెల్లడించారు.మరోవైపు, రాజధాని నగరంలో కరోనా బాధితుల సంఖ్య 219కి చేరినట్టు దిల్లీ సీఎం కేజ్రీవాల్‌ తెలిపారు. మొత్తం బాధితుల్లో 108 మంది మర్కజ్‌ నిజాముద్దీన్‌ కార్యక్రమంలో పాల్గొన్నారని వెల్లడించారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 4 కరోనా మరణాలు జరిగాయని, వీరిలో ఇద్దరు మర్కజ్‌ ప్రార్థనల్లో పాల్గొన్నవారేనని చెప్పారు.మరోవైపు, కేజ్రీవాల్ వైద్యులకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించిన సంగతి తెలిసిందే. కరోనా మహమ్మారిపై పోరాటంలో ఒకవేళ ఎవరైనా వైద్య సిబ్బంది చనిపోతే వారి కుటుంబాలకు రూ.కోటి ఆర్థిక సాయం చేస్తామని బుధవారం వెల్లడించారు. కొవిడ్‌-19పై పోరులో వైద్యుల సేవలు సైన్యం కంటే తక్కువేమీ కాదని అభిప్రాయపడ్డారు. కరోనా రోగులకు సేవలందిస్తూ డాక్టర్లు, నర్సులు, పారిశుద్ధ్య సిబ్బంది ఎవరైనా ప్రాణాలు కోల్పోతే వారికి గౌరవసూచకంగా ఆయా కుటుంబాలకు రూ.కోటి అందిస్తామని చెప్పారు. వారు ప్రభుత్వ, ప్రైవేటు రంగానికి చెందిన వారైనా పరిహారం వర్తిస్తుందని సీఎం చెప్పారు.